Monday 11 June 2018

పొగ తాగితే ప్రాణం పోతుంది



ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల కేన్సర్లు పెరిగిపోతున్నాయి. పొగతాగే అలవాటుకు తోడు విపరీతంగా దుమ్మూ, ధూళితో కూడిన పరిసరాల్లో ఉండేవారు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారు. స్త్రీలలో కంటే పురుషుల్లో కేన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు అమెరికాలోని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలో ఊపిరితిత్తుల కేన్సర్ విజృంభణపై వారు పరిశోధన చేశారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల కేన్సర్లు, రావడానికి కారణమైన అధ్యయనాలను పరిశీలించి క్రోడీకరించారు. పొగతాగే అలవాటు, ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు వంటి పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనిచేసేవారు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నట్లు తేల్చారు.ఈ కేన్సర్ బారిన పడితే దగ్గుతున్నప్పుడు నోట్లో నుంచి రక్తం రావడం, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం, తల నొప్పి, ఎముకల నొప్పి, గొంతు నొప్పి వంటివి కనిపిస్తాయి. వీటితోపాటు దీర్ఘకాలంగా దగ్గు ఉండడం, శ్వాస తీసుకోవడం, వదలడంలో ఇబ్బందిగా ఉండడం, ఆకలి మందగించడం, గొంతు బొంగురు పోవడం, అలసట, బలహీనంగా తయారవడం, ఏదైనా తినేటప్పుడు మింగడానికి కష్టమవడం వంటి లక్షణాలు ఉంటాయి.



ఊపిరితిత్తుల కేన్సర్ ను పల్మనరీ కార్సినోమా అని కూడా అంటారు. ముఖ్యంగా మూడు రకాల ఊపిరితిత్తుల కేన్సర్లు ఉన్నాయి. ఒకటి స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ (ఎస్ సీఎల్ సీ), రెండోది నాన్-స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ (ఎన్ఎస్ సీఎల్ సీ), మూడోది మాలిగ్నెంట్ మేసోథెలియోమో కేన్సర్. ఇందులో స్మాల్ సెల్ లంగ్ కేన్సర్ ఎక్కువగా వస్తుంది. మాలిగ్నెంట్ మేసోథెలియోమో కేన్సర్ చాలా అరుదుగా వస్తుంది. ఊపిరితిత్తుల కేన్సర్ కు ప్రధాన కారణం పొగతాగే అలవాటే. ముఖ్యంగా చైన్ స్మోకర్లు, బీడీలు వంటివి తాగేవారికి ప్రమాదం ఎక్కువ.

1 comment: