Thursday 13 June 2019

రక్తదాతలకు వందనాలు

అన్నిదానాల కంటే రక్తదానం మిన్న. ఎందుకంటే మనిషికి ప్రాణం పోసేది దేవుడైతే.. ఆ మనిషిని భూమ్మీదకు తీసుకొచ్చేది తల్లి మాత్రమే. కానీ రక్తదాత మాత్రం తనకు తెలియకుండానే ఎన్నో ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంది. తాను  ఎవరికి రక్తం దానం ఇస్తున్నాడో తెలియకుండానే.. నిస్వార్థంగా ఓ ప్రాణం నిలబెట్టడం చిన్న విషయం కాదు. మనిషిలో దేవుడున్నాడని చెప్పేందుకే ఇదే అతిపెద్ద ఉదాహరణ. రెగ్యులర్ గా రక్తదానం చేస్తూ.. ఎందరికో ఊపిరి పోస్తున్న రక్తదాతలందరికీ వందనాలు. 

రక్తదానం తర్వాత..?


రక్తదానం చేస్తే ఇన్‌ఫెక్షన్లు వస్తాయనేది అపోహ మాత్రమే.. శుభ్రమైన(స్టెరైల్‌) పరికరాలు వాడితే ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.
ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తవు. రక్తదానం తర్వాత కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే చాలు.
ఒకసారి రక్తదానం చేయడానికి గంటకన్నా ఎక్కువ సమయం పట్టదు.
రక్తదానం చేసిన తర్వాత హిమోగ్లోబిన్‌ పడిపోతుందనేది కొందరి అపోహ.
ఒకసారి 400 మి.లీ కంటే తక్కువ తీసుకుంటారు. మన శరీరం దీనిని చాలా త్వరగానే భర్తీ చేసుకుంటుంది.
క్రమం తప్పకుండా రక్తదానం చేసే వారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
ఇక ఎదురుచూపులు మానుకోవాలి…
మనం బతికున్నప్పుడు మన కళ్ళముందు.. మన ద్వారా మరొకరి ప్రాణం కాపాడాము అనే అనుభూతి గురించి మాటల్లో చెప్పలేము.కానీ, చాలామంది తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా బాగోలేకపోతే ఎవరు రక్తదానం చేస్తారా? అని ఎదురు చూస్తారే తప్ప మనమే ఎందుకు రక్తదానం చెయ్యకూడదు అని ఆలోచించరు.

మేము ఇవ్వలేము.. మా వల్ల కాదు..అనే ఇటువంటి ఆలోచనా విధానాలు ఇకనైనా మానాలి. మేము కూడా ఇవ్వగలము.. అనే ఆలోచన రావాలి.

మీరు కూడా రక్తదాతలు అవ్వండి..ప్రాణదాతలు కండి..

రక్తదాత ఎలా ఉండాలి..?

రక్తదాత ఎలా ఉండాలి?

రక్తదాతలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి.
45 కేజీల పైబడి బరువుండాలి.
సాధారణ స్థాయిలో బీపీ, షుగర్‌ ఉండాలి.
18-60 మధ్య వయసు కలిగిన స్త్రీ, పురుషులు రక్తదానం చేయవచ్చు.
3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు.
రక్తదానం చేయడానికి 12 గంటల ముందు, తర్వాత ఆల్కాహాల్‌ తీసుకోకూడదు.
స్త్రీలు గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకు రక్తదానం చేయకూడదు.
.
                                                                                                    -swapnika reha



ప్రపంచ రక్తదాన దినోత్సవం

wecare@bajajfinserv.in



ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్తంగా జూన్ 14 వ తేదిని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రజల్లో రక్తదానం యొక్క ప్రాముఖ్యతను మరియు అవగాహనను పెంచి, సరైన సమయంలో సురక్షిత రక్త లభ్యతతో ప్రపంచవ్యాప్తంగా మహిళల మరణాలను తగ్గించడం ఈ ఆరోగ్య దినోత్సవ అంతిమ లక్ష్యం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 800 మంది మహిళలు ప్రసవసమయంలో ఏర్పడే ఇబ్బందులతో మరణిస్తున్నారు. ప్రసవసమయంలో మహిళల్లో జరిగే తీవ్రరక్తస్రావం ఈ మరణాలకు గల ప్రధాన కారణం.

ప్రసవ సమయంలో తీవ్రరక్తస్రావం వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మరణిస్తున్న మహిళలు

• ఆఫ్రికా: 34 శాతం
• ఆసియా: 31 శాతం
• లాటిన్ అమెరికా & కరీబియన్: 21 శాతం


రక్తమార్పిడి విధానానికి ఆద్యుడైన కార్ల్ ల్యాండ్ స్టీనర్ జన్మదినానికి గుర్తుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2004వ సంవత్సరంలో జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరపడం మొదలుపెట్టింది. కేవలం ప్రసవ సమయంలో మహిళలకే కాకుండా, రోడ్డు ప్రమాదాలు, పెద్దాపరేషన్ల సమయంలో రోగులకు కూడా చాలా రక్తం అవసరమౌతుంది. ఇలాంటప్పుడు రక్తనిధి కేంద్రాల అవసరం ఎంతో ఉంటుంది. అందుకే ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది.




Monday 4 February 2019

కేన్సర్ తో జర భద్రం

కేన్సర్ మహమ్మారి గురించి పలు ఆరోగ్య, స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో ఇంకా చైతన్యం అంతంత మాత్రంగానే ఉంది. దేశంలో ఏటా కేన్సర్ మరణాలు పెరుగుతున్నాయి. గ్లోబోకాన్ సంస్థ అంచనా ప్రకారం.. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ కారణంగా 96 లక్షలు మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దేశంలో 11,57,294 కేసులు నమోదు కాగా, వారిలో 7,84,821 మంది మృత్యువాత‌ పడ్డారు. ఏటా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (యూఐసీసీ) ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించి దానిని అంతమొందించాలన్నదే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఏటా ఒక థీమ్‌ను తీసుకుని ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది ' I Am and I Will' అనే నినాదాన్ని ఎంపిక చేశారు.

శరీరంలో ఏదైనా అవయవానికి కేన్సర్ సోకితే తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు. వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధరణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లనూ ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదు. క్యాన్సర్ అంటువ్యాధికాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువే. అయితే, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, పాంక్రియాస్ క్యాన్సర్లు జన్యుపరంగా సక్రమిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ కేన్సర్లు వస్తే వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు సైతం ఏమాత్రం తగ్గుముఖం పట్టవు. కాబట్టి దీనిపై అవగాహనతో ఎదుర్కొవాలి.



కేన్సర్‌కు కారణాల్లో ఆధునిక జీవన శైలి ప్రధానమైంది. మద్యం, పొగతాగడం, ఆహారపదార్థాల్లో రంగులు వినియోగం, రసాయనాలు వాడటం, హార్మోన్లు అధికంగా వాడటం, అధిక బరువు, కాలుష్యం, క్రిమిసంహారకాలు, చికిత్సలో భాగంగా లేదా ప్రమాదవశాత్తు రేడియేషన్‌కు గురికావడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ క్యాన్సర్‌కు కారకాలు. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. వాటిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌‌కు ప్రధాన కారణం హెచ్‌పీవీ వైరస్. కాబట్టి దీనికి వ్యాక్సిన్ వేసుకుని నివారించవచ్చు. 9 ఏళ్లు పైబడిన బాలికల నుంచి 40 ఏళ్ల మహిళల వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే అండాశయం, గొంతు క్యాన్సర్ రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది.

క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం, దానికి ఇతర అవయవాలకు విస్తరించే గుణం ఉందా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, థెరపీలు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడం, త్వరగా గుర్తించడంతో పాటు ఆ కణితులు పరిమాణం, దశ, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. కాన్సర్‌కు వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారూ దీని బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. కానీ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లను చాలా వరకు పూర్తిగా నయం చేయగలిగినవే. అయితే, వయస్సు పెరిగేకొద్ది కేన్సర్స్ వచ్చే ముప్పు ఎక్కువ. ఈ సమయంలో వచ్చే కేన్సర్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది.


అందుకే కేన్సర్ చికిత్సను కూడా వయస్సును బట్టి నిర్ధరిస్తారు. క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి కీమోథెరఫీ, రేడియోథెరఫీలతో పాటు ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే కీహోల్ సర్జరీలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. సర్జరీ తర్వాత రేడియో, కీమో, హార్మోన్ థెరఫీ లాంటివి చేసినా, లేక థెరఫీల తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో అయిపోయిందని భావించరాదు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడుందనే విషయం తెలుసుకోవడం కష్టం. ఏ అవయవానికి సోకిందనే అనుమానం ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, యఫ్‌యన్‌ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ స్కాన్, యంఆర్‌ఐ, పీఈటీ స్కాన్ వంటివి అవసరాన్ని బట్టి చేస్తారు. అయితే సర్వైకల్ క్యాన్సర్‌ను పాప్‌స్మియర్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు.

Friday 6 July 2018

కీటోనైజ్డ్ డైట్ తో కేన్సర్ మందుల మెరుగు



తక్కువ కార్బొహైడ్రేట్లు, మోస్తరు ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే కేన్సర్‌ ఔషధాల సామర్థ్యం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.



ఈ ఆహార పదార్థాలు ఔషధాలకు కేన్సర్‌ కణితులను చంపే శక్తిని అందిస్తాయని అమెరికాలోని వైల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్సులిన్‌ స్థాయుల్ని అదుపులో ఉంచేందుకు ఈ కెటోజెనిక్‌ ఆహారం ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు.

Thursday 5 July 2018

కేన్సర్ తిరగబెట్టకుండా ట్రీట్ మెంట్



చికిత్స చేసిన తరువాత కూడా కేన్సర్‌ మళ్లీమళ్లీ తిరగబెడుతుంది ఎందుకు? కేన్సర్‌ మందులు కొందరికి పనిచేస్తాయి. ఇంకొందరికి చేయవు. ఎందుకు? కేన్సర్‌ కణితిలోని మూలకణాలు కొన్నిసార్లు నిద్రాణంగా, మరికొన్ని సార్లు చురుకుగా ప్రవర్తించడం వల్ల ఇలా జరుగుతూంటుంది. వీటిని తొలగించగలిగితే కేన్సర్‌కు చెక్‌ పెట్టడమూ సాధ్యమే. అచ్చంగా ఈ ఘనతనే సాదించారు మిషిగన్‌ యూనివర్శిటీలోని రోజెల్‌ కేన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు. నిద్రాణంగా ఉన్నప్పుడు ఈ మూలకణాలు గ్లూకోజ్‌ ద్వారా, చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఆక్సిజన్‌ ద్వారా శక్తిని పొందుతూంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ రెండు మార్గాలను అడ్డుకోవడం ద్వారా కేన్సర్‌ మూలకణాలను నాశనం చేయగలిగారు.



కీళ్లనొప్పులకు వాడే ఓ మందుతో మైటోకాండ్రియా (కణాలకు శక్తిని తయారు చేసే భాగం) పనితీరును అడ్డుకోవడంతో పాటు, ఆక్సిజన్‌ కూడా అందకుండా చేసినప్పుడు మూలకణాలు నాశనమై పోయాయి. కణాలను విషాలతో చంపేందుకు బదులుగా తాము జీవక్రియలను ఉపయోగించామని, తద్వారా కేన్సర్‌ కణం తనంతట తానే చనిపోయే పరిస్థితి కల్పించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విచా మేడలైన్, సిడ్నీ ఫోర్బ్స్‌లు తెలిపారు. కేన్సర్‌ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇమ్యూనోథెరపీకి, ఈ మూలకణ చికిత్సను జోడిస్తే మెరుగైన చికిత్స కల్పించడంతోపాటు కేన్సర్‌ తిరగబెట్టకుండా చూడవచ్చునని వీరు అంటున్నారు.