Monday 7 November 2016

టైర్లు కాలిస్తే క్యాన్సర్ ఖాయం


టైర్లు  కాలితే వెలువడే పొగ రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది! ముఖ్యంగా కేన్సర్ ముప్పు అధికమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1.ఒక్క టైరు తయారీలో సహజ రబ్బరుతోపాటు సింథటిక్ రబ్బరును, స్టీలు వైర్లను వాడతారు. సింథటిక్ రబ్బరు తయారీలో దాదాపు 7 లీటర్ల పెట్రోలు, క్లోరిన్, స్టైరీన్, బుటాడియెన్‌వంటి హానికర రసాయనాలు, 20 రకాలకు పైగా హెవీ మెటల్స్ వాడతారు. వీటిలో స్టైరీన్, బుటాడియెన్ రెండూ కేన్సర్ కారకాలే. అలాగే.. టైర్ల తయారీలో వాడే సీసం, క్రోమియం, కాడ్మియం, పాదరసం ప్రమాదకర కాలుష్య కారకాలు.

2.ఈ పొగ నుంచి వెలువడే డయాక్సిన్లు సుదీర్ఘ దూరాల పాటు ప్రయాణించి భూమిమీద, నీళ్లలోనూ, మొక్కలపైనా, జంతువులు, మనుషులపైనా దట్టంగా పరుచుకుంటాయి. జంతువుల, మనుషుల కొవ్వు కణాల్లో పేరుకుపోతాయి. ఈ డయాక్సిన్లు మనుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని మందగింపజేస్తాయి. వీటివల్ల మధుమేహం వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది.

3. 1991లో.. కెనడియన్ ఓంటారియో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎనర్జీ వారు ఒక పరిశోధన చేశారు. దాని ప్రకారం.. టైర్లు కాల్చిన నేలలో ఆ కాలుష్యం రెండు వందల రోజులకు పైగా తన ప్రభావం చూపుతోందని వారు గుర్తించారు. అంతేకాదు, ఆ ప్రదేశం నుంచి చుట్టుపక్కల 200 మీటర్ల దూరం దాకా పండించిన కూరగాయల్లోనూ ఆ కాలుష్యం తాలూకు ఆనవాళ్లున్నాయి.


4.టైర్లను కాల్చినప్పుడు వాటిలో ఉండే భారలోహాలు పూ ర్తిగా నాశనం కాకుండా వాటి అవశేషాలు నేలలో కలిసి మన ఆహారచక్రంలోకి ప్రవేశించి తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతాయి. ఈ అవశేషాలు కలిగిన ఆహారం తినేవారిలో నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదమూ ఉంది. జింక్ అవశేషాలు పుట్టబోయే బిడ్డల్లో అనేక లోపాలను కలగజేస్తాయి. ఇక క్రోమియం..కేన్సర్ బారిన పడేస్తుంది.

5.ఆందోళన సమయాల్లో టైర్లను తగలబెట్టేవారికి తెలియని విషయమేంటంటే.. ఈ చర్య ద్వారా వారు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఆ చుట్టుపక్కల నివసించేవారిని సైతం లంగ్ కేన్సర్, బ్లడ్ కేన్సర్ వంటి వాటి బారిన పడేస్తున్నారు. ముఖ్యంగా.. చిన్నపిల్లలపై ఈ విషవాయువుల ప్రభావం మరింత తీవ్రంగా ఉం టుంది. టైర్ల పొగ నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు వారి ఊపిరితిత్తుల్లోకి చొరబడి వాటిని పాడుచేస్తాయి.

6. టైర్లలోని సీసం నేలలో కరిగి ఆహారచక్రంలో కలిసినప్పుడు.. ఆ ఆహారం తినే పసిపిల్లలు మానసిక వైకల్యానికి గురయ్యే ముప్పు అధికం.

No comments:

Post a Comment