Friday 6 July 2018

కీటోనైజ్డ్ డైట్ తో కేన్సర్ మందుల మెరుగు



తక్కువ కార్బొహైడ్రేట్లు, మోస్తరు ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే కేన్సర్‌ ఔషధాల సామర్థ్యం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.



ఈ ఆహార పదార్థాలు ఔషధాలకు కేన్సర్‌ కణితులను చంపే శక్తిని అందిస్తాయని అమెరికాలోని వైల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్సులిన్‌ స్థాయుల్ని అదుపులో ఉంచేందుకు ఈ కెటోజెనిక్‌ ఆహారం ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు.

Thursday 5 July 2018

కేన్సర్ తిరగబెట్టకుండా ట్రీట్ మెంట్



చికిత్స చేసిన తరువాత కూడా కేన్సర్‌ మళ్లీమళ్లీ తిరగబెడుతుంది ఎందుకు? కేన్సర్‌ మందులు కొందరికి పనిచేస్తాయి. ఇంకొందరికి చేయవు. ఎందుకు? కేన్సర్‌ కణితిలోని మూలకణాలు కొన్నిసార్లు నిద్రాణంగా, మరికొన్ని సార్లు చురుకుగా ప్రవర్తించడం వల్ల ఇలా జరుగుతూంటుంది. వీటిని తొలగించగలిగితే కేన్సర్‌కు చెక్‌ పెట్టడమూ సాధ్యమే. అచ్చంగా ఈ ఘనతనే సాదించారు మిషిగన్‌ యూనివర్శిటీలోని రోజెల్‌ కేన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు. నిద్రాణంగా ఉన్నప్పుడు ఈ మూలకణాలు గ్లూకోజ్‌ ద్వారా, చైతన్యవంతంగా ఉన్నప్పుడు ఆక్సిజన్‌ ద్వారా శక్తిని పొందుతూంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ రెండు మార్గాలను అడ్డుకోవడం ద్వారా కేన్సర్‌ మూలకణాలను నాశనం చేయగలిగారు.



కీళ్లనొప్పులకు వాడే ఓ మందుతో మైటోకాండ్రియా (కణాలకు శక్తిని తయారు చేసే భాగం) పనితీరును అడ్డుకోవడంతో పాటు, ఆక్సిజన్‌ కూడా అందకుండా చేసినప్పుడు మూలకణాలు నాశనమై పోయాయి. కణాలను విషాలతో చంపేందుకు బదులుగా తాము జీవక్రియలను ఉపయోగించామని, తద్వారా కేన్సర్‌ కణం తనంతట తానే చనిపోయే పరిస్థితి కల్పించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విచా మేడలైన్, సిడ్నీ ఫోర్బ్స్‌లు తెలిపారు. కేన్సర్‌ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇమ్యూనోథెరపీకి, ఈ మూలకణ చికిత్సను జోడిస్తే మెరుగైన చికిత్స కల్పించడంతోపాటు కేన్సర్‌ తిరగబెట్టకుండా చూడవచ్చునని వీరు అంటున్నారు.

Wednesday 4 July 2018

వేపాకు మిశ్రమంతో కేన్సర్ దూరం



మనకు అందుబాటులో ఉండే వేపాకుల మిశ్రమం నుంచి కేన్సర్‌ను దూరం చేసే మందును హైదరాబాద్‌కు చెందిన శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఎన్‌ఐపిఇఆర్) శాస్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. తమ శాస్తవ్రేత్తలు చేసిన పరిశోధనల్లో వేప ఆకులు, పువ్వులతో తయారు చేసిన రసాయన మిశ్రమం రొమ్ము కేన్సర్ వ్యాప్తిని తగ్గించి, దానిని నివారిస్తుందని రుజువైందని నిపర్ శాస్తవ్రేత్త చంద్రయ్య గొడుగు వెల్లడించారు. ప్రస్తుతం ఇవి క్లినికల్ ట్రయల్స్‌లోనే ఉన్నాయని, మున్ముందు చేసే పరిశోధనల్లో మరింత మంచి ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము మరింత విస్తృతంగా పరిశోధించడానికి, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి నిధులు సమకూర్చాలని బయోటెక్నాలజీ, ఆయుష్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కోరినట్టు ఆయన చెప్పారు.



మన దేశంలో వేపచెట్లు విస్తృతంగా ఉంటాయని, ఈ నేపథ్యంలో తాము తయారు చేసే మందు రొమ్ముకేన్సర్ చికిత్సకు అతిచౌకగా తయారవుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే వేపకు అనేక ఔషధ గుణాలున్నట్టు నిర్ధారణ అయిందని, ఆయుర్వేద వైద్యంలో దీనిని అనేక రోగాల చికిత్సకు వాడుతున్నారని, వేపను కేన్సర్ తగ్గించడంలోకూడా ఉపయోగించవచ్చునని తమ పరిశోధనల్లో ఇప్పుడు తేలిందన్నారు. రొమ్ము కేన్సర్ రోగులపై దీనిని ప్రయోగించగా, కేన్సర్‌ను తగ్గించడమే కాక, నెగటివ్ బ్రెస్ట్ కేన్సర్ కణాలను మూడింతలు చేసిందన్నారు. శాండిల్య, బైరా, అమిత్ ఖురానా, జగన్మోహన్ సోమగాని, ఆర్.శ్రీనివాస్, ఎంవిఎన్ కుమార్ తాళ్లూరి లతో కూడిన బృందం కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కెమోథెరపీ దుష్పరిణామాలను సైతం తగ్గించడానికి ఈ కొత్తమందు ఉపయోగపడుతుందని కనుగొన్నారన్నారు. అంతేకాకుండా ఇది కేన్సర్ కణాలను నిర్వీర్యం చేయడం, చంపడం కూడా చేస్తుందన్నారు. రాబోయే నాలుగైదేళ్లలో క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని చంద్రయ్య గొడుగు వ్యక్తం చేశారు.