Saturday 13 May 2017

అమ్మలకు కేన్సర్ టెస్ట్ తప్పనిసరి

సృష్టికి ప్రతి సృష్టి అమ్మ. ప్రపంచంలో అన్నింటి కన్నా మధురమైనది, తియ్యనైనది, అపురూపమైనది అమ్మ ప్రేమ. యుగాలు మారిన, తరాలు మారిన, మారనిది అమ్మ అభిమానం.  అమ్మ ప్రేమ వెలకట్టలేనిది, విలువ కట్టలేనిది. తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక తన ఆనందాన్ని కుటుంబం కోసం, పిల్లలకోసం త్యజించేది అమ్మఒక్కతే. అమ్మ గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. అలాంటి అమ్మ మరో ప్రాణికి జన్మనిచ్చే సమయం అంటే ఆమెకు పునర్జన్మే. అలాంటప్పుడు ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి మహిళా జీవితంలో అత్యంత సున్నితమైనది మాతృత్వం. మహిళ గర్భం దాల్చినప్పుడు శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయి. కొంతమందిలో ఏమి తిన్నా వెంటనే వాంతి అవ్వడం, కొన్ని రకాలవాసనలు పడకపోవడం సహజం. అలాంటప్పుడు ఏమీ తినకపోవడం వల్ల నీరసించిపోతారు. అందువల్ల ఏదో ఒక తేలిక పాటి ఆహారం తీసుకోవడం వల్ల అన్నీ క్రమంగా తగ్గుతాయి.  శరీరంలో ఉన్న హార్మోన్ల మార్పుల వల్ల ఒక్కోసారి తిన్న ఆహారం జీర్ణం కాకపోవచ్చు. ఎక్కువగా కూరగాయాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే అవి త్వరగా జీర్ణమవుతాయి. గర్భిణీలు ఒత్తిడికి లోనవకుండా, ఆనందంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కొంతమందిలో కాళ్లు, ముఖం వంటి అవయవాలకు వాపులు వస్తుంటాయి. సాయంత్రంవేళల్లో కొద్ది సేపు వాకింగ్‌
చేయడం వల్ల ఈ వాపులను తగ్గించుకోవచ్చు.



ఇక కాన్పు తర్వాత గర్భాశయం బరువు వల్ల వెన్నునొప్పి, పిరుదులు, తొడల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఫిజియోథెరఫీ చేయించుకోవడం వల్ల ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. కాన్పు తర్వాత మూత్రానాళ ఇన్‌ఫెక్ష్లన్లూ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తారు. ఫెల్విక్‌ఫ్లోర్‌ వంటి వ్యాయామాలు చేయడం వల్లవాటిని నివారించవచ్చు. కాన్పు తర్వాత బిడ్డకు పాలు పట్టకపోవడం వల్ల రొమ్ముల్లో పాలు గడ్డకట్టి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఈ ఇన్‌ఫెక్షన్లు తల్లి శరీరంలోకి వ్యాపించే ప్రమాదమూ ఉంది. అలాగే పిల్లల నోటిలో పూతల వల్ల రోగక్రిములు రొమ్ముల్లోకి చేరి, చీముగడ్డలు ఏర్పడవచ్చు. అందువల్ల పిల్లలకు పాలిచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు
తీసుకోవాలి. సీజేరియన్‌ అయిన వాళ్లు కుట్ల దగ్గర చీము పట్టకుండా చూసుకోవాలి.

కాన్పు తర్వాత రక్తస్రావం జరగడం సహజమే. కానీ అదే ఎక్కువ అవుతుంటే దాన్ని వైద్య పరిభాషలో ఫోస్ట్‌ పార్టమ్‌ హేమరేజ్‌ అంటారు. దీనికి ప్రధాన కారణం గర్భాశయ ముఖద్వారం చీరిపోవడం, గర్భాశయం లోపల మాయ మిగిలిపోవడం, గర్భాశయం కుంచించుకుపోవడం. బ్లీడింగ్ ఎక్కువ అయితే తల్లి ప్రాణానికే ప్రమాదం. కాబట్టి వెంటనే వైద్యులు తగిన చర్యలు తీసుకోవాలి.  కాన్పు తర్వాత తల్లులు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా పిల్లల మీదే ఎక్కువ శ్రద్ధపెట్టడం వల్ల ఇలాంటి అనర్థాలు ఎక్కువగా జరిగి తల్లిప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. కాన్పు అవక ముందు, అయిన తర్వాత కూడా తల్లి తన ఆరోగ్యం గురించి అన్ని విధాలా పట్టించుకోవాలి.